Hyderabad: తెలంగాణలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ధాన్యం తడిసి పాడైపోగా, మామిడి తోటల్లో పూత, పిందెలు నేలరాలాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో భారీ వడగండ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ, వర్షం కారణంగా రైతులు అపార నష్టాన్ని ఎదుర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వడగండ్ల వాన పడే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

