Srushti Test Tube Baby case: రాజస్థాన్కు చెందిన గోవింద్ సింగ్, సోనియా దంపతులు సంతానం కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. కానీ వారిని నమ్మకద్రోహం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సరోగసీ పేరుతో భారీ డబ్బులు
గత ఏడాది ఆగస్టులో ఈ దంపతులు డాక్టర్ నమ్రతను కలిశారు. ముందుగా టెస్టుల కోసం రూ.66 వేలు వసూలు చేశారు. సరోగసీకి వెళ్లమని సూచిస్తూ, వారి స్పెర్మ్, ఎగ్ సేకరించి మొత్తం ఖర్చు రూ.30 లక్షలు అవుతుందని చెప్పారు. రూ.15 లక్షలు నగదు, రూ.15 లక్షలు చెక్కుగా ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.
దీనిలో భాగంగా ఆగస్టులోనే రూ.5 లక్షలు నమ్రత ఖాతాకు బదిలీ చేశారు. సెప్టెంబర్లో విశాఖపట్నంలో స్పెర్మ్, ఎగ్ సేకరణ పూర్తయింది. సరోగసీ విజయవంతమైందని చెప్పి మరికొంత డబ్బు వసూలు చేశారు. ఈ ఏడాది మే నాటికి మొత్తం రూ.30 లక్షలు చెల్లించారు.
ఇది కూడా చదవండి: Bhubaneswar Metro Rail: భువనేశ్వర్ మెట్రో ప్రాజెక్ట్ను రద్దు చేసిన ప్రభుతవం.. ఎందుకంటే..?
డీఎన్ఏ టెస్ట్ కోరగా నిరాకరణ
బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్ఏ పరీక్ష చేయాలని దంపతులు కోరగా, డాక్టర్ నమ్రత నిరాకరించారు. సరోగసీకి అంగీకరించిన మహిళ భర్త రూ.3.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పడంతో బాధితులు రూ.2.50 లక్షలు ఇచ్చారు.
తరువాత విశాఖలో డాక్టర్ కల్యాణి ఒక బిడ్డను చూపించారు. కానీ ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయగా, ఆ బిడ్డ తమది కాదని తేలింది.
పోలీసుల దర్యాప్తు
నిజం తెలిసిన గోవింద్ సింగ్, సోనియా ఆ బిడ్డను అసలైన తల్లిదండ్రులకు అప్పగించాలని డాక్టర్ కల్యాణికి చెప్పారు. నమ్రతను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాధితుల నంబర్ను బ్లాక్ చేసింది.
దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, డాక్టర్ నమ్రత, సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిల్లల అక్రమ విక్రయం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ తర్వాత నమ్రతను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
