Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు, జూలై 25, 2025 నుంచి శ్రావణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 24, 2025 వరకు ఒక నెల రోజుల పాటు కొనసాగుతాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, శ్రావణ మాసంలో మొత్తం 16 రోజుల పాటు గర్భాలయ, సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో, అలాగే వరలక్ష్మీ వ్రతం, పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజుల్లో ఈ నిలుపుదల ఉంటుంది. ఆగస్టు 15 నుంచి 18 తేదీల మధ్య స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. ఈ నాలుగు రోజులు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగిలిన రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి కల్పిస్తారు.
Also Read: Sravana Masam: శ్రావణ మాసం: వరలక్ష్మీ వ్రతం, వాయనంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!
భక్తుల సౌకర్యార్థం రెండు విడతలుగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రావణ మాసంలో శ్రీశైలం సందర్శించాలనుకునే భక్తులు ఆలయ వెబ్సైట్ను లేదా అధికారిక ప్రకటనలను సందర్శించి, తాజా సమాచారాన్ని తెలుసుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా, రద్దీని నివారించడానికి ఆన్లైన్లో ముందస్తు టోకెన్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
