Revanth Reddy

Revanth Reddy: భద్రాచలంలో కమనీయం.. రామయ్య కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లోక కల్యాణం కోసం వేచి చూస్తున్న భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం మిథిలా మండపంలో కన్నులపండువగా సాగుతోంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ “జై శ్రీరామ్” అనే నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత గారు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ శుభకార్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో కల్యాణ వేదిక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కల్యాణోత్సవానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.351 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మొదటి విడత అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభంతో భద్రాచలం రూపురేఖలు మారనున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *