Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలు.. బీఆర్ఎస్ పిటిషన్
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, గత నెల 25న ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
నోటీసులు అందుకోబోయే ఎమ్మెల్యేలు వీరే
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ అడ్వొకేట్ జనరల్, ఇతర సీనియర్ న్యాయవాదులతో సంప్రదించారు. చర్చల అనంతరం ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయాలని కోరిన ఎమ్మెల్యేల జాబితాలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, కృష్ణమోహన్రెడ్డి, మహిపాల్రెడ్డి ఉన్నారు.
తుది నిర్ణయం స్పీకర్ చేతిలో
ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన తర్వాత, వారి వివరణ తీసుకుని స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ పది మందిలో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.