AP Liquor Scam: ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతున్న లిక్కర్ కుంభకోణం కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డిని మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనపై విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు, న్యాయాధికారి పి. భాస్కరరావు శ్రీధర్రెడ్డిని గురువారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో మరో కీలక నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు దిలీప్ను ఒక రోజు పాటు సిట్ కస్టడీలోకి తీసుకోవచ్చని కూడా కోర్టు అనుమతినిచ్చింది. గురువారం దిలీప్ను సిట్ అధికారులు విచారణ నిమిత్తం తమ అధీనంలోకి తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Mavoist: కర్రెగుట్టలో రక్తపు మరకలు.. 31 మావోయిస్టుల మృతి
ఇదిలా ఉండగా, లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్రమంలో హైదరాబాద్లోని ఆరు ప్రాంతాల్లో సిట్ సిబ్బంది విస్తృత సోదాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ప్రత్యేక కార్యదర్శి (ఓఎస్డీ) కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్రెడ్డికి చెందిన కంపెనీల్లో రెండు రోజులుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
విచారణలో భాగంగా కీలక పత్రాలు, డేటా సర్వర్లు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు, పలు అక్రమ చలామణీలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సిట్ దర్యాప్తు మరింత లోతుగా సాగుతోన్న నేపథ్యంలో, ఈ కేసులో మరిన్ని రాజకీయ నేతలు, అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

