Hyderabad: హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో గల సర్దార్ పటేల్ నగర్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు ఆలయంలోకి చొరబడి స్వామివారికి చెందిన విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన వెండి మరియు బంగారు వస్తువులు పోయినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. దొంగలు సుమారు 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున పూజారులు ఎప్పటిలాగే ఆలయ తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా, స్వామివారి మూలవిరాట్ పై ఉండాల్సిన నగలు కనిపించలేదు. గర్భాలయం చిందరవందరగా ఉండటాన్ని గమనించిన పూజారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దొంగలు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు.
