Sai pallavi: ప్రసిద్ధ నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో గౌరవాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ‘కళైమామణి’ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన విజేతల జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి సాయి పల్లవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వాటిలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (2023), దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ తదితరులు ఉన్నారు.
సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళారంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తోంది. రాష్ట్రంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విజేతలకు మూడు సవర్ల బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.
త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విజేతలకు ఈ పురస్కారాలను స్వయంగా ప్రదానం చేయనున్నారు.