ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు.”షమీ మోకాళ్లలో వాపు ఉంది. అతను 100 శాతం ఫిట్ గా ఉండేందుకు సమయం ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో షమీని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ లేకుండా అత్యున్నత ప్రదర్శన చేయడం చాలా కష్టం. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ముందు షమీ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలి”. అని హిట్ మ్యాన్ తెలిపాడు.
రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే షమీ ఈ నవంబర్ లో జరగబోయే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తుంది. కాగా గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్లోని ఓ హాస్పిటల్లో ఈ సర్జరీ నిర్వహించారు.
సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.