RGV: ప్రస్తుతం ఇండియాలో సౌత్ సినిమాల హవా కొనసాగుతుండటంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. రాబోయే బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తే, సౌత్ సినిమాల ఫార్ములా కనుమరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్ వర్సెస్ నార్త్.. వర్మ విశ్లేషణ
“దురంధర్ 2 అనేది ఒక సాధారణ సినిమా కాదు, అది ఒక గ్రహశకలం (Asteroid) లాంటిది. ఇది ఇప్పటివరకు నడుస్తున్న పాతకాలపు మాస్, మసాలా సినిమాలనే డైనోసార్లకు అంతిమ సంస్కారం చేస్తుంది” అని ఆయన విశ్లేషించారు.
సౌత్ సినిమాల్లో హీరో కొడితే వందల మంది గాలిలోకి ఎగరడం, కార్లు గల్లీల్లో పల్టీలు కొట్టడం వంటివి గ్రావిటీకి విరుద్ధంగా ఉంటాయని.. కానీ దురంధర్ లో యాక్షన్ చాలా సహజంగా, రియలిస్టిక్గా ఉంటుందని ఆయన ప్రశంసించారు.
రూ. 2,000 కోట్లే లక్ష్యం
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1,500 నుండి 2,000 కోట్లు వసూలు చేస్తే, సౌత్ ఇండస్ట్రీ తన మేకింగ్ స్టైల్ను మార్చుకోవాల్సి వస్తుందని వర్మ అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులు కేవలం విజువల్ వండర్స్ మాత్రమే కాకుండా, తెలివైన కథలను కూడా కోరుకుంటున్నారని ఈ సినిమా నిరూపిస్తుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. కేవలం ప్రీమియర్ల ద్వారానే రూ. 13 కోట్లు రావడం బాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మార్చి 19న బిగ్ ఫైట్
వచ్చే వారం మార్చి 19న విడుదల కానున్న ‘దురంధర్ 2’కు పోటీగా తెలుగులో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిలవనుంది. యశ్ నటించిన ‘టాక్సిక్’ వాయిదా పడటంతో, బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు పవన్ వర్సెస్ రణవీర్ మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. బాహుబలి తరహాలో ఏకకాలంలో రెండు పార్టులను పూర్తి చేయడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
