Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత కులగణన చేపట్టడం ద్వారా బలహీనవర్గాల అభివృద్ధికి మార్గం సుగమం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
“మేం చేయలేని పని కాంగ్రెస్ చేసింది అని కేబినెట్లో ఉన్నవారు, ప్రతిపక్షం కూడా ఒప్పుకోవాలి. ఆ గొప్పతనం ఉంటే మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి అభినందనలు చెప్పేవారు,” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఐదు సార్లు ప్రధానికి లేఖ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు ఐదు సార్లు ప్రధానమంత్రికి లేఖ రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో జంతర్మంతర్లో దీక్ష పెట్టగా దాదాపు వందమంది పార్లమెంట్ సభ్యులు మద్దతు పలికారని ఆయన గుర్తుచేశారు.
“ఆ సమయంలో రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరైనా మాట్లాడారా? బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశ్యం ఆ పార్టీకే లేదు,” అని సీఎం విమర్శించారు.
గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై సీఎం అసంతృప్తి
బీసీ రిజర్వేషన్ బిల్లుపై గంగుల కమలాకర్ విమర్శలు అనవసరమని సీఎం పేర్కొన్నారు. “నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల గారికి పూర్తి అవగాహన ఉంది. కానీ ఆయన వెనకవాళ్ల ఒత్తిడి వల్ల తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు,” అని రేవంత్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేరు.. మన బాలయ్య గ్రేట్..
“మా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. బీసీ కమిషన్కు, డెడికేటెడ్ కమిషన్కు పూర్తి అధికారాలు ఇచ్చాం,” అని ఆయన స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే
బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఫిబ్రవరి 4న ‘సోషల్ జస్టిస్ డే’గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. “మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము పనిచేస్తున్నాం. బలహీనవర్గాలకు అనుమానాలు కలిగేలా తప్పుడు ప్రచారం చేయవద్దు. ప్రజలు ఆ నిర్ణయం తీసుకుంటారు,” అని రేవంత్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం మా ప్రభుత్వ చిత్తశుద్ధి అని సీఎం స్పష్టం చేశారు. “సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. బలహీనవర్గాల శ్రేయస్సే మా కర్తవ్యం,” అని రేవంత్ రెడ్డి ధృవీకరించారు.
