Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రులతో భేటీ అయ్యి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతోందని, ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
సభలో విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి దీటుగా సమాధానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనతో ఉండి, ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. సభలో ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ వంటి నిబంధనలను సమర్థవంతంగా వాడుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాలు జనవరి 4వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మరోవైపు, అసెంబ్లీ పనిదినాలు మరియు చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరుకాగా, ప్రతిపక్షాల నుండి హరీష్ రావు, అక్బరుద్దీన్ ఓవైసీ , మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఏయే అంశాలపై చర్చ జరగాలనే దానిపై ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
