Revanth Reddy: తెలంగాణ శాసనసభలో ఈరోజు ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి, ఆయనతో కరచాలనం (Handshake) చేసి “ఎలా ఉన్నారు?” అని కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరు అగ్ర నేతలు ఇలా మర్యాదపూర్వకంగా కలుసుకోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాము ప్రతి సభ్యుడిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. “కేసీఆర్ ని నేను ఈరోజే కాదు, గతంలో ఆయనకు సర్జరీ అయినప్పుడు ఆస్పత్రిలో కూడా వెళ్లి పరామర్శించాను. సభ్యులందరి పట్ల మాకు గౌరవం ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ సభ నుంచి అంత త్వరగా ఎందుకు వెళ్లిపోయారో తనకి తెలియదని, ఆ విషయాన్ని ఆయననే అడగాలని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నారనే విషయంపై మీడియా ఆరా తీయగా, రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకున్న విషయాలను మీకు ఎలా చెబుతాం?” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, సభలో ఇలాంటి పలకరింపులు ప్రజాస్వామ్యానికి మంచివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
