Renuka Chaudhary: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ సైనికాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది దేశంలో అత్యంత భయానక పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు. మంగళవారం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
పార్లమెంట్ ప్రాంగణంలో ఐఏఎన్ఎస్ సంస్థతో మాట్లాడిన రేణుకా చౌదరి మాట్లాడుతూ, “ప్రభుత్వం కోసం గొంతుకగా మారాలని సైన్యంపై ఒత్తిడి తేవడం ఇదే మొదటిసారి. ఆర్మీ అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి తమపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. నేను సైనిక కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా చెబుతున్నాను… దీనిపై వెంటనే విచారణ జరగాలి” అని ఆమె అన్నారు.
రేణుకా వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడుల సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు సైన్యాన్ని అనుమానించిన చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు సైన్యంపై ఒత్తిడి, వేధింపులు అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, సోమవారం రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను పార్లమెంట్కు తీసుకురావడం మరో వివాదానికి దారి తీసింది. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా అని మీడియా ప్రశ్నించగా, “కరవాలనుకునే వారు పార్లమెంట్లోపలే ఉన్నారు” అని ఆమె చేసిన వ్యాఖ్యపై బీజేపీ పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపింది.

