Nandigam Suresh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు జూన్ 2వ తేదీ వరకు న్యాయరిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టిడిపి కార్యకర్తపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్ను ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం కోర్టు హాజరు కోసం ముందుగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు (బీపీ), మధుమేహం వంటి ప్రాథమిక ఆరోగ్య పరిమితులను పరిశీలించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: సోషల్ మీడియా నియంత్రణపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
నందిగం సురేష్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు అత్యధిక భద్రత ఏర్పాట్లు చేశారు. కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో నందిగం సురేష్పై చర్యలకు రాజకీయ ప్రేరణ ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, బాధితుడు మాత్రం న్యాయం కోసం పోరాడుతానని స్పష్టం చేశాడు. కేసుపై మరింత విచారణ జరగనుంది.
