AP: సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా గారామకృష్ణ ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోలింగ్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. మొత్తం 1,159 ఓట్లకు గాను 1,105 ఓట్లు పోలయ్యాయి, అంటే దాదాపు 95 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. రామకృష్ణ ప్యానెల్ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడంతో సచివాలయ ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. ఉపాధ్యక్షుడిగా పవన్ కుమార్ ఎన్నికవ్వగా, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎం. లక్ష్మణకుమారి విజయం సాధించారు.
Also Read: khaleda zia: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత!
ఈ ఎన్నికల్లో కొన్ని పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో నాపా ప్రసాద్ కేవలం 6 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. ఆయన కోట్ల రాజేశ్ ప్యానెల్ తరపున బరిలో నిలిచారు. అదే ప్యానెల్ నుంచి బి. లింగారెడ్డి అదనపు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మిగిలిన కీలక పదవుల్లో రామకృష్ణ ప్యానెల్ అభ్యర్థులు కేవీ రాజేంద్రప్రకాష్ (సంయుక్త కార్యదర్శి – ఆర్గనైజింగ్), పి. సునీత (సంయుక్త కార్యదర్శి – మహిళ), ఇ. మధుబాబు (సంయుక్త కార్యదర్శి – స్పోర్ట్స్) ఘనవిజయం సాధించారు.
సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కొత్త కార్యవర్గం కృషి చేయనుంది. విజేతలకు తోటి ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్ల పాటు ఈ కొత్త కమిటీ సచివాలయ ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం వహించనుంది.
