Rajnath Singh: మా టార్గెట్ ఉగ్రవాదులు పాక్ కాదు..

Rajnath Singh: భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సైన్యం రాత్రికి రాత్రే అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించి, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు.

సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, “మన సైనికులు అసాధారణ సాహసం చేశారు. ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన దాడులు చేసి, దేశ భద్రతను సమర్థంగా కాపాడారు. ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని, సామాన్య పౌరుల్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా జరిపాం,” అని వివరించారు.

పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులే ఈ దాడుల్లో లక్ష్యంగా మారినట్టు చెప్పారు. ఉగ్రవాదుల చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఈ ఆపరేషన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతు ఇవ్వడంపై ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“భారత లక్ష్యం పాకిస్థాన్ కాదు, ఉగ్రవాదులే,” అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ధైర్యంగా ముందడుగు వేసిన సైనికులపై అభినందనలు తెలియజేశారు. సరిహద్దుల్లో పటిష్టమైన నిఘాతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

భారత ప్రభుత్వం ప్రకారం, ఈ ఆపరేషన్‌లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. కానీ పాకిస్థాన్ సైనిక సదుపాయాలను టార్గెట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉద్రిక్తతలు మరింత ముదరకుండా నివారించగలిగామని వివరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *