Raja Singh: గోషామహల్ నియోజకవర్గంలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గోషామహల్ శాసనసభ్యుడు, బీజేపీ నేత రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అయితే, స్థానిక ప్రజలు ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా వంటి మహమ్మారులకు చికిత్స అందిస్తారని, దీని వల్ల మైదానం చుట్టూ ఉన్న ప్రజలు వైరస్ వ్యాధుల పట్ల భయాందోళన చెందుతున్నారని రాజాసింగ్ తెలిపారు.
పాత ఉస్మానియా ఆసుపత్రి వద్దే కొత్త భవన నిర్మాణానికి తగిన స్థలం ఉందని, అక్కడే ఆసుపత్రి నిర్మించాలని శాసనసభలో తాను మాట్లాడిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. స్థానిక ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి ఆలకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనికోరారు.