R.krishnaiah: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 20,555 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు 16,758 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన 3,758 మంది నిరుద్యోగంగా మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తే రెవెన్యూ శాఖ బలోపేతం కావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 17న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వీఆర్ఏలు ఇచ్చిన పిలుపుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
నిరుద్యోగులను మోసం చేయొద్దు
నిరుద్యోగుల ఓటు బ్యాంకుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారి జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని ఆర్. కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పాటయితే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే, విద్యార్థులు, యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వీరికి తగిన గుణపాఠం తప్పదని ఆర్. కృష్ణయ్యహెచ్చరించారు.