Droupadi Murmu: భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వార్షిక శీతాకాల విడిది కోసం బుధవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి సికింద్రాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సౌకర్యాల వంటి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం చుట్టూ పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి, పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి బస కారణంగా ఆ సమయంలో సామాన్యులకు రాష్ట్రపతి నిలయం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.
Also Read: APSRTC: ఇకపై వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్
రాష్ట్రపతి తన పర్యటనలో పలు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొననున్నారు:
డిసెంబర్ 19: హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 20: గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే బ్రహ్మకుమారీస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ‘టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్’ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు.
డిసెంబర్ 22: రాష్ట్రపతి తన ఐదు రోజుల పర్యటనను ముగించుకుని, సోమవారం ఉదయం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఈ ప్రాంతాలలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్టుల ఎగురవేతపై నిషేధం విధించారు. ఉన్నతాధికారులు BNS సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
