IBomma Ravi Case

IBomma Ravi Case: పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ రవిని ఎలా పట్టుకున్నారు? సీపీ శ్రీనివాస్ వెల్లడి

IBomma Ravi Case: ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసులో కీలక నిందితుడు ఇమంది రవి నుంచి సేకరించిన వివరాలను సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ గారు మంగళవారం మీడియాకు వెల్లడించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసు దర్యాప్తు వివరాలను ఆయన స్పష్టం చేశారు. ఐబొమ్మ రవి ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో దొరికారని, ఈ పైరసీ వెబ్‌సైట్ ద్వారా భారీగా డబ్బు సంపాదించారని అధికారులు తెలిపారు.

సంపాదన, ఆర్థిక లావాదేవీలు
ఐబొమ్మ రవికి సినిమాల పోస్టింగ్‌ల ద్వారా కంటే, వెబ్‌సైట్‌లో వచ్చే బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారానే అధిక ఆదాయం వచ్చిందని సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. రీడైరెక్ట్ స్క్రిప్ట్ ఉపయోగించి వినియోగదారులను గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు మళ్లించడం ద్వారా రవి ఇప్పటివరకు దాదాపు ₹20 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్లు తేలింది. ఈ డబ్బును రవి తన పేరు మీద నడుపుతున్న ‘యాడ్ బుల్’ అనే కంపెనీకి డాలర్ల రూపంలో విదేశీ ట్రాన్సాక్షన్ల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. రవి తన క్రెడిట్ కార్డు వాడి ఐబొమ్మ డొమైన్‌ను ‘ఎన్‌జిల’ కంపెనీలో రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక, రవి లక్ష డాలర్లు ఖర్చు చేసి కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా కొనుక్కున్నట్లు తేలింది.

Also Read: AP: ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం

వెబ్‌సైట్ నిర్వహణ, ట్రాపింగ్
రవి ‘ఐబొమ్మ’తో పాటు ‘బప్పం’ అనే మరో వెబ్‌సైట్‌ను కూడా నడిపేవాడు. ఈ వెబ్‌సైట్లను రవి స్నేహితుడైన నిఖిల్ అనే వ్యక్తి డిజైన్ చేయగా, అతనే పోస్టర్లను కూడా రూపొందించేవాడు. రవి ఒంటరిగా వారానికో దేశం తిరుగుతూ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. రవిని పట్టుకోవడానికి పోలీసులు నిఖిల్ను ప్రధాన పాత్రగా ఉపయోగించి జాగ్రత్తగా ట్రాప్ చేశారు. అంతేకాక, దర్యాప్తు జరుగుతున్న సమయంలో రవి విచారణను గమనించేందుకు గుర్తు తెలియని ఐడి నుంచి పోలీసులకు మెయిల్ పంపించాడు. దానిపై రివర్స్ ఇంజినీరింగ్ చేసి, ఆ మెయిల్‌ను పంపింది రవినేనని పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తు కొనసాగింపు
రవి భార్య నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, విచారణ కోసం ఆమెను ప్రశ్నించలేదని సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా సంక్లిష్టతతో కూడుకున్నదని అధికారులు పేర్కొన్నారు. మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి మరికొన్ని పైరసీ వెబ్‌సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయని, ఆ నిర్వాహకులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వెబ్-3 టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పైరసీని పట్టుకోవడం మరింత కష్టమవుతుందని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రవికి హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *