Narendra Modi: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. సోమవారం (మార్చి 2) సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ సహా ఎనిమిది దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గల్ఫ్ దేశాలకు సంఘీభావం ప్రకటించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడి భారత్ మద్దతును తెలియజేశారు.
గల్ఫ్ దేశాల్లో విధ్వంసం.. అంతర్జాతీయ దేశాల స్పందన
ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల ధాటికి సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాల్లోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడులను ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా భారత్ కూడా ఈ దాడులను ఖండిస్తూ గల్ఫ్ దేశాల సార్వభౌమత్వానికి భంగం కలగడం ఆందోళనకరమని పేర్కొంది.
సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ మాటామంతి
సౌదీ అరేబియా ప్రధాన మంత్రి, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. “సౌదీ అరేబియాపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు అత్యంత అవసరం” అని మోడీ పేర్కొన్నారు. అలాగే, యుద్ధ వాతావరణంలో అక్కడున్న భారతీయ సమాజం క్షేమ సమాచారాన్ని చూసుకుంటున్నందుకు సౌదీ యువరాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
బహ్రెయిన్ రాజుతో చర్చలు.. భారతీయుల భద్రతే ముఖ్యం
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో మాట్లాడిన ప్రధాని, ఆ దేశంపై జరిగిన దాడుల పట్ల విచారం వ్యక్తం చేశారు. బహ్రెయిన్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న రక్షణను ప్రధాని కొనియాడారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.
ప్రాంతీయ శాంతికి విఘాతం
ఇరాన్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో అస్థిరత ఏర్పడింది. చమురు సరఫరాపై ఈ దాడుల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది.
