PM Modi:

PM Modi: ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

PM Modi: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో చోటుచేసుకున్న భయానక ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో విహరించడానికి వచ్చిన పర్యాటకులపై అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన స్థలంలో చుట్టూ మృతదేహాలు, రక్తపు మడుగులు కనిపించడంతో భయానక వాతావరణం నెలకొంది.

సాధారణ విందు రద్దు – మోదీ వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు

ఈ అమానుష ఘటన సమాచారం అందుకున్న వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే విరమించుకుని, ఉదయం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయ‌న ముందుగా హాజరుకావాల్సిన అధికారిక విందును కూడా రద్దు చేసుకున్నారు. ప్రధాని రావడంతో అత్యవసర భద్రతా సమీక్షా సమావేశం (CCS) నిర్వహించనున్నారు. ఉగ్రదాడిపై చర్చిస్తూ, తదుపరి చర్యలకు దిశానిర్దేశం చేస్తారు.

అమిత్ షా కశ్మీర్‌కు పయనమయ్యారు

ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే కశ్మీర్‌కు బయలుదేరి, అక్కడి భద్రతా బలగాల అధికారి, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గాయపడినవారిని హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. గాయాలపాలైన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మోదీ ఖండన – బాధితులకు మద్దతు

ఈ దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “ఈ దారుణమైన చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టం. మన పోరాటం ఉగ్రవాదంపై కొనసాగుతుంది. భవిష్యత్తులో మరింత ధీటుగా స్పందిస్తాం” అని తెలిపారు. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజల మద్దతు – దేశం కలసి నిలబడాలి

ఈ విధ్వంసం నేపథ్యంలో దేశమంతా ఒక్కటిగా స్పందిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటువంటి దాడులపై దేశం ఏకతాటిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *