PM Modi: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ‘నవ భారత్’ ఇతివృత్తంతో ఈ వేడుకలను నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12వ సారి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి చరిత్ర సృష్టించారు.
స్వాతంత్య్ర వేడుకలకు ముందు, ప్రధాని మోదీ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూల వర్షం కురిపించాయి. వాటిలో ఒకటి జాతీయ జెండాను, మరొకటి ‘ఆపరేషన్ సింధూర్’ జెండాను మోసుకెళ్ళడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని ఈసారి వేడుకల్లో భాగంగా జరుపుకున్నారు.
ఈ మహోత్సవంలో 25 వేల మంది అతిథులు పాల్గొనగా, వారిలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు ప్రత్యేక అతిథులుగా ఉన్నారు. వీరంతా ‘నవ భారత్’ చిహ్నాన్ని రూపొందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రత; 11,000 మంది భద్రతా సిబ్బందితో పాటు 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో. దేశవ్యాప్తంగా కూడా భద్రతను పటిష్ఠం చేశారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధించాలన్న లక్ష్యానికి ఒక అడుగుగా నిలిచింది.
అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం సాధించిన ప్రగతిని వివరించి, భవిష్యత్తు ప్రణాళికలను తెలియజేశారు. ఈ ప్రసంగంలో దేశాభివృద్ధి, స్వావలంబన, శాంతి, సామరస్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు.