Pm modi: జమ్ము కశ్మీర్ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించిన మోదీ, శుక్రవారం ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను దేశానికి అంకితమిచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోనీవాలా ఆదిల్ హుస్సేన్ను స్మరించుకున్నారు. “కుటుంబ పోషణ కోసం కష్టపడిన ఆదిల్ను కూడా ఉగ్రవాదులు బలితీశారు. ఇది పేదల జీవనోపాధిని నాశనం చేసే కుట్రల భాగమే,” అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదంపై ఠీవి పోరాటం
“మన పొరుగున ఉన్న దేశం పర్యాటకానికి, మానవత్వానికి శత్రువులా వ్యవహరిస్తోంది. పహల్గామ్ దాడి ఉగ్రవాద కుట్రల్లో భాగమే. అమాయకుల ప్రాణాలు తీసే ఈ చర్యలకు సమాధానంగా ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా చేపట్టాం. నెల రోజుల క్రితం పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు మెరుపుదాడులు నిర్వహించాయి,” అని ప్రధాని గుర్తు చేశారు.
“పాకిస్తాన్ కుట్రలకు భారత్ దీటుగా స్పందిస్తోంది. ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి మా పోరాటం ఎప్పటికీ ఆగదు. ఎంత అడ్డంకులు వచ్చినా, కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ నిలిపివేయలేరు,” అని మోదీ స్పష్టం చేశారు.
ఇంజినీరింగ్ అద్భుతం – చినాబ్ వంతెన
“ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన చినాబ్ వంతెన భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. ఇది దేశ సంకల్పబలానికి చిహ్నంగా నిలుస్తుంది,” అని ప్రధాని ప్రశంసించారు. అనేక సవాళ్లను అధిగమించి మాతా వైష్ణోదేవి ఆశీస్సులతో ఈ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
“ఈ వంతెనతో కశ్మీర్ భారత రైల్వే నెట్వర్క్తో పూర్తిగా అనుసంధానమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ప్రయాణం ఇక వాస్తవమైంది. ఇది లక్షలాది మంది ప్రజల కలలకు నెరవేర్పుగా నిలిచింది,” అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించిన ప్రధాని, “సీఎం ఒమర్ అబ్దుల్లా ఎనిమిదో తరగతిలో చదువుకుంటున్నప్పటినుంచి ఈ వంతెన ప్రాజెక్ట్ గురించి కలలు కన్నారట. ఆ కలను నెరవేర్చింది బీజేపీ ప్రభుత్వం” అని అన్నారు.
కశ్మీర్ పర్యాటకానికి నూతన దిశ
చినాబ్ వంతెనతో కాశ్మీర్ పర్యాటకానికి కొత్త ఊపొస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం వంతెన కాదు, కొత్త యుగానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.