Pm modi: జమ్మూ కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో 38 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన గాఢ సంతాపం తెలిపారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రధాని స్పందన
“కిష్ట్వార్ వరద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికోసం ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తాం” అని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
సహాయక చర్యలకు ఆటంకాలు
మారుమూల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించడంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారని, వారిని హెలికాప్టర్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారని సమాచారం.
రక్షణ బృందాలు రంగంలోకి
సమాచారం అందిన వెంటనే సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గాయపడిన వారికి వైద్యసహాయం అందించడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.