Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆయన తన సొంత నిధులు అందించారు.
పాఠశాలకు అవసరమైన 25 కంప్యూటర్లు ఇతర ఫర్నిచర్ను ఆయన సమకూర్చారు. ఈ సామాగ్రిని పవన్ కళ్యాణ్ తరఫున పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాఠశాల యాజమాన్యానికి లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్లతో పాటు గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను కూడా అందజేశారు.
గతంలో, అంటే ఈ నెల 5వ తేదీన చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే పాఠశాల అభివృద్ధి కోసం కంప్యూటర్లు, పుస్తకాలు ఇస్తానని ఆయన బహిరంగంగా హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే, కేవలం పది రోజుల్లోనే ఆ మాటను నిలబెట్టుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది స్థానికులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
