Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విశాఖకు వస్తుండటంతో స్థానిక నాయకులు, అభిమానులు విమానాశ్రయం వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులను పవన్ కల్యాణ్ సమీక్షించనున్నారు.
నగరంలోని పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలను స్వీకరిస్తూ, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సాయంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Yadagirigutta: స్వామివారి బంగారు, వెండి డాలర్లు మాయం.. ఆడిట్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు!
జనసేనాని రాకను పురస్కరించుకుని నగర పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుండి ఆయన వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో విమానాశ్రయం పరిసరాలు జనసంద్రంగా మారాయి. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
