Budget session: భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ భేటీకి పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: Congo Fever: వ్యాపిస్తున్న కొత్త వైరస్..ఒకరు మృతి..వ్యాక్సిన్ కూడా లేదు.. కాంగో జ్వరం అంటే ఏమిటి?
అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి.
