Pakistani: హైదరాబాద్ పాతబస్తీలో గత రెండేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ యువకుడు మహ్మద్ ఫయాజ్ (26)ను సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతనిపై అక్రమంగా దేశంలోకి చొరబడిన కేసు నమోదై, కోర్టు విచారణ కొనసాగుతోంది. అయితే, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్తానీయులు భారత్ను విడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో, ఫయాజ్ వ్యవహారం మళ్లీ హాట్టాపిక్గా మారింది.
పెళ్లి కోసం చైనా మార్గంలో చొరబాటు:
ఫయాజ్ 2009లో దుబాయ్లో హైదరాబాద్కు చెందిన నేహా ఫాతిమాతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భార్య నేహా 2021లో కుమారుడితో కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చింది. ఆమెను కలవడానికి ఫయాజ్ 2022 నవంబర్లో చైనా గుండా నేపాల్కు చేరుకుని, అక్కడి నుంచి రైలు, బస్సుల ద్వారా హైదరాబాద్కు చొరబడ్డాడు. అత్తమామల సాయంతో “మహ్మద్ గౌస్” అనే నకిలీ పేరుతో పుట్టిన సర్టిఫికెట్ కూడా సర్దుబాటు చేశాడు.
ఇది కూడా చదవండి: Karregutta Kagar: మావోయిస్టు ‘విప్లవం’ సమాధి కానుందా?
బహదూర్పూర్ పోలీసులు ఫయాజ్ కోసం గాలింపు చేపట్టి, 2023 సెప్టెంబర్లో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో చట్ట ప్రకారం విచారణ నడుస్తుండగా, తాజాగా కేంద్ర ఆదేశాలతో మళ్లీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా ఇద్దరు పాకిస్తానీలు కస్టడీలో:
ఫయాజ్తోపాటు మరో ఇద్దరు పాకిస్తానీలు కూడా హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక కస్టడీలో ఉన్నారు. వీరు కూడా గత కొంతకాలంగా వివిధ నేరాల్లో పాల్పడి అరెస్ట్య్యారు. జైళ్లలో కాకుండా ప్రత్యేక భద్రత కస్టడీలో ఉంచిన ఈ ముగ్గురినీ దేశ సరిహద్దుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసులు ఇంకా విచారణలో ఉండటంతో సంబంధిత కోర్టుల అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
తదుపరి నిర్ణయం మీద అయోమయం:
ఫయాజ్ భార్య, కుమారుడు భారతీయులే కావడం, కోర్టులో కేసు ప్రాసెస్ జరగడం వంటివి అధికారుల ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. అతన్ని వెంటనే వెనక్కి పంపించాలా? లేక కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూడాలా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులు చర్చిస్తున్నారు.

