Padi kaushik reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి తాను మాట్లాడే ఫోన్లను మాత్రమే కాదు, తన భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలపై కూడా వినిపించుకునే పనిలో ఆయన ఉన్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారాన్ని సాధారణంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీలో ఓ వ్యాఖ్యలో ఫోన్ ట్యాపింగ్ నైసర్గికమేనని చెప్పారని గుర్తుచేశారు. ఇటువంటి వ్యవహారాలపై రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతోపాటు తన సొంత మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇంతటితో ఆగకుండా, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మా మీద నీచంగా మాట్లాడితే, నువ్వు ఎవరివెవరితో తిరిగావో… ఆ పదహారు మందిని బహిరంగపరుస్తా” అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్లలో ఉన్న నీ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసునని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారన్న ఆరోపణలు చేశారు.
