Padi kaushik reddy: కరీంనగర్ జిల్లా రివ్యూ సమావేశంలో కరీంనగర్ ఆర్డీవో విధులకు ఆటంకం కలిగించినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా సవాలు విసిరారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, “నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరి తీయండి. చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. “రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్వి. నీకు ధైర్యం ఉందా? కోర్టుకు వెళ్లగానే జడ్జి బెయిల్ ఇచ్చి బయటకు పంపాడు. నాపై బేకర్ కేసులు పెట్టడం తప్పా? నన్ను కలెక్టర్ పిలిస్తే వెళ్లాను. కరీంనగర్ ఆర్డీవోతో నా జీవితంలో మాట్లాడలేను. ఆయన డ్యూటీకి ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదు చేయించడం అన్యాయం. ఈ ఆరోపణలపై ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను” అని కౌశిక్ రెడ్డి అన్నారు.
తనపై అన్యాయంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాను వెనుకడుగు వేయబోనని ఆయన స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి గమనించు, ఇది కౌశిక్ రెడ్డి. నువ్వు ఎంత చేస్తే నేను ఇంకా ఎక్కువ చేస్తా. భయపడే ప్రసక్తే లేదు. ఇది కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ. మాది భయపడే రక్తం కాదు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టం” అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
