Pulivarthi Nani: పూతల పట్టు నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు,ఇండ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకతీతంగా న్యాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి విన్నవించారు. 1956 జాతీయ రహదారుల చట్టం 3 జి (4) గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కుక్కల పల్లి నుంచి మల్లవరం వరకు 140 జాతీయ రహదారిలో చెక్ డ్యాంలు, కాలువల నిర్మాణం కోసం అవసరమగు భూసేకరణ విషయమై రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పలుదఫాలు కోరిన మేరకు చిత్తూరు జెసి మంగళవారం చంద్రగిరి తాశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు సరియైన న్యాయం జరగకపోవడంతో పలువురు పరిహారాన్ని తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పనపాకం వద్ద ఫ్లై ఓవర్ సమీపంలో 80 మంది రైతులకు మూడు సెంట్ల ఇంటి స్థలాలను మంజూరు చేయవలసి ఉన్న వారికి న్యాయం జరగలేదని తెలిపారు. రైతుల సమస్యలను ఉదారంగ పరిశీలించి తగిన న్యాయం చేయాలని,రంగంపేట సమీపంలోని ఫ్లై ఓవర్ ను అదేవిధంగా పనపాకం సమీపంలోని ఫ్లైఓవర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి,ప్రజలకు అందుబాటులో తేవలసిందిగా ఎమ్మెల్యే నాని కోరారు. జాతీయ రహదారికి ఇరువైపులా రైతులకు ఎక్కువ భూములు లేకపోవడంతో వారికి పాత రిజిస్ట్రేషన్ ధరలను అనుసరించి కాక ప్రస్తుత ధరలను అనుసరించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే నాని జెసికి తెలిపారు. చిన్న సన్నకారు రైతులు జాతీయ రహదారి విస్తరణ పనుల వలన భూములు ఇండ్లు కోల్పోయారని వారికి సక్రమంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సమస్యను జెసి దృష్టికి తీసుకుని వెళ్లారు.