Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎన్ఐఏ, పటియాలా పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు.
అతని వద్ద నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ అనుచరులపై నిఘా కొనసాగిస్తుండగా, రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిన హషన్ డ్యానిష్ను, ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఇదే క్రమంలో బోధన్లో గాలింపు జరిపిన అధికారులు పక్కా సమాచారం ఆధారంగా ఉగ్ర సంబంధాలు కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.