Nitish Kumar Reddy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 సూపర్ లీగ్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బంతితో మెరుపులు సృష్టించాడు. మధ్యప్రదేశ్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నితీష్ కుమార్ రెడ్డి కీలకమైన హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. ఈ హ్యాట్రిక్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్గా ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ రజత్ పాటిదార్ వికెట్ను తీయడం హైలైట్గా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ జట్టు కేవలం 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ, నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్తో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ను ప్రారంభంలోనే కుప్పకూల్చాడు. మధ్యప్రదేశ్ ఛేదనలో నితీష్ కుమార్ రెడ్డి వేసిన మూడో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. ఆ ఓవర్లోని వరుసగా మూడు బంతుల్లో హర్ష్ గావ్లి, హర్ప్రీత్ సింగ్ భాటియా, రజత్ పాటిదార్ వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ను పూర్తి చేశాడు. ముఖ్యంగా, ఓవర్ చివరి బంతికి నితీష్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన రజత్ పాటిదార్ (డకౌట్) క్లీన్ బౌల్డ్ కావడంతో నితీష్ సంబరాల్లో మునిగిపోయాడు.
ఈ హ్యాట్రిక్ స్ట్రైక్తో మధ్యప్రదేశ్ స్కోరు కేవలం 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. నితీష్ కుమార్ రెడ్డి తన టీ20 కెరీర్లో సాధించిన తొలి హ్యాట్రిక్ ఇదే కావడం విశేషం. బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన నితీష్, అంతకుముందు బ్యాటింగ్లో కూడా 27 బంతుల్లో 25 పరుగులు చేసి, ఆంధ్ర జట్టు గౌరవప్రదమైన స్కోరుకు చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. నితీష్ హ్యాట్రిక్ మ్యాచ్ను రసవత్తరంగా మార్చినప్పటికీ, రిషబ్ చౌహాన్ (47), రాహుల్ బథమ్ (35 నాటౌట్)ల కీలక ఇన్నింగ్స్ల కారణంగా మధ్యప్రదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏదేమైనప్పటికీ, ఈ హ్యాట్రిక్తో నితీష్ కుమార్ రెడ్డి దేశవాళీ క్రికెట్లో తన ఆల్రౌండ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

