Nitin gadkari: దేశవ్యాప్తంగా వాహనదారులందరికీ ఒకే విధమైన టోల్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం జాతీయ రహదారులపై అధిక టోల్ వసూళ్లు, తగిన రహదారి సేవల కొరత వంటి కారణాలతో వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, టోల్ చార్జీలపై వాహనదారుల నుంచి వస్తున్న ట్రోలింగ్, విమర్శల గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
టోల్ ఫీజులపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న సంగతి తనకు తెలుసని, అయితే త్వరలోనే కొత్త టోల్ విధానం ద్వారా ప్రయాణికులకు ఉపశమనం కల్పించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన పరిశోధన ఇప్పటికే పూర్తయిందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటికే టోల్ ఫీజులపై అనేక మీమ్లు వైరల్ అవుతున్నాయని, ప్రజలు కొంత కోపంగా ఉన్నారని గడ్కరీ అన్నారు. అయితే ఈ కోపం మరికొన్ని రోజుల్లో తగ్గిపోతుందని, కొత్త విధానం వల్ల ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తుందని స్పష్టం చేశారు.
అయితే, టోల్ వసూళ్లు పూర్తిగా రద్దవుతాయా? లేక టోల్ చార్జీలు తగ్గుతాయా? అనే అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా కూడా కేంద్రం తీసుకోనున్న నిర్ణయం వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని గడ్కరీ హామీ ఇచ్చారు.