Nimmala ramanaidu: ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సమావేశాన్ని రెండు రాష్ట్రాల సంబంధాల్లో ఒక కీలక ఘట్టంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చర్చల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రామానాయుడు మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగాయని, కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్లోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనలలోని సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించినట్టు వివరించారు.
ఇది రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దంగా పెండింగ్లో ఉన్న జల సమస్యల పరిష్కారానికి శుభ సూచకంగా భావిస్తున్నామని అన్నారు. ఇరు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఓ సహకార ఒప్పందం దిశగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సోమవారం లోపు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నిమ్మల రామానాయుడు వెల్లడించారు.