Nimmala: పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన నేపథ్యంలో ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి నీటిలో సగటున మూడు వేల టీఎంసీలు ఉండగా, అందులో రాష్ట్రం కేవలం 200 టీఎంసీల నీటినే వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.
నిమ్మల రామానాయుడు ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడమే లక్ష్యం, తెలంగాణకు ఎటువంటి నష్టం కలగదని స్పష్టం చేశారు. నీటి మళ్లింపుతో ఎవరికి హాని జరుగదని, ప్రాజెక్ట్ సాంకేతికంగా, చట్టపరంగా సరైనదేనని మంత్రి వివరించారు.
అంతేకాకుండా, ఇరు రాష్ట్రాలు చర్చలు, పరస్పర అవగాహన, మరియు సమన్వయం ద్వారా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి నీటి వినియోగం వివాదానికి కారణం కాదని, అందుబాటులో ఉన్న నీటి మొత్తం పరిమాణం దృష్ట్యా తెలంగాణకు ఆందోళన అవసరం లేదని నిమ్మల పేర్కొన్నారు.
