NHAI: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి వాహనదారుల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నది. ఇన్సూరెన్స్, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలపై ఓ కీలక నిబంధనను తేనున్నది. వాహనాలకు బీమా పాలసీ లేకపోతే ఫాస్టాగ్ రీచార్జి బ్యాలెన్స్ నుంచి జరిమానా కట్ చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. అదే విధంగా జనవరి 1 నుంచే వాణిజ్య వాహనాలకు ట్రాకింగ్ డివైజెస్ తప్పనిసరి చేశారు. అయితే ఇన్సూరెన్స్, పెండింగ్ చలాన్లు పూర్తిగా క్లియర్ అయితేనే వాహనాలకు పర్మిట్లను జారీ చేయనున్నారు.
NHAI: మరోవైపు జాతీయ రహదారులపై వేగ నియంత్రణపైనా దృష్టి పెట్టారు. వాహనాల వేగంతోనే ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నదని, మరణాల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. అందుకే వేగ నియంత్రణపై కేంద్రం నజర్ పెట్టింది. నిర్ణీత వేగ పరిమితికి మించి ప్రయాణిస్తే గరిష్ఠంగా రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు. దీనిని కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
NHAI: ఇదిలా ఉండగా, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన యాజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఉన్న ఫాస్టాగ్ల కోసం నో యువర్ వెహికిల్ (కేవైవీ) ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కొత్త నిబంధన కూడా ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించనున్నది.
