New Sarpanches: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లెల్లో నేడు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈరోజు (డిసెంబర్ 22) పదవీ బాధ్యతలు స్వీకరించి, గ్రామాభివృద్ధి దిశగా తొలి అడుగు వేయనున్నారు.
ముహూర్తం ఖరారు.. పల్లెల్లో సందడి
వాస్తవానికి ఈ కార్యక్రమం డిసెంబర్ 20నే జరగాల్సి ఉన్నప్పటికీ, ‘మంచి రోజులు’ కాదన్న కారణంతో ప్రభుత్వం నేటికి (డిసెంబర్ 22) వాయిదా వేసింది. ఉదయం 10:30 గంటలకు రాష్ట్రంలోని 12,702 గ్రామాల్లో ఏకకాలంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ప్రమాణ స్వీకార ప్రక్రియ ఇలా సాగనుంది:
ముందుగా ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ మొదటి సమావేశం జరుగుతుంది. ఇందులో ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కీలక తీర్మానం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Samantha: హీరోయిన్ సమంతకు చేదు అనుభవం
రెండేళ్ల పాలనా శూన్యానికి ముగింపు
గత పాలకవర్గాల గడువు ముగిసి రెండేళ్లు దాటినా, పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ రెండేళ్లు ప్రత్యేక అధికారుల (Special Officers) పాలనలో ఉన్న గ్రామాలు, ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో జరిగిన పోలింగ్లో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు
గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు ప్రతి పంచాయతీలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే గ్రామాభివృద్ధి ప్రణాళికలపై ప్రాథమిక చర్చలు జరగనున్నాయి.
