LPG Cylinder: దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. సిలిండర్ల రీఫిల్ బుకింగ్కు సంబంధించి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చాయి. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు సబ్సిడీని క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయిన వెంటనే మరో సిలిండర్ను బుక్ చేసుకోవడం సాధ్యం కాదు. దీనికోసం నిర్ణీత గడువు వరకు వేచి చూడాల్సిందే.
ఎవరికి ఎన్ని రోజుల గడువు?
వినియోగదారులు కలిగి ఉన్న కనెక్షన్ రకం మరియు పథకాన్ని బట్టి ఈ గడువు మారుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
-
డబుల్ సిలిండర్ కనెక్షన్ (DBC): మీ దగ్గర రెండు సిలిండర్లు ఉన్నట్లయితే, ఒక సిలిండర్ ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 35 రోజుల గడువు ముగిశాకే మరో రీఫిల్ బుకింగ్ చేసుకోవాలి.
-
ఉజ్వల పథకం (PMUY): ప్రధాని మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు ఆగాల్సి ఉంటుంది.
-
సింగిల్ సిలిండర్ కనెక్షన్: ఒకే సిలిండర్ ఉన్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తూ, 25 రోజుల తర్వాత రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
గడువు ముందే బుక్ చేస్తే ఏమవుతుంది?
చమురు సంస్థలు సాఫ్ట్వేర్లో చేసిన మార్పుల ప్రకారం, పైన పేర్కొన్న గడువు ముగియక ముందే ఎవరైనా రీఫిల్ కోసం ప్రయత్నిస్తే ఆ బుకింగ్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఈ నిబంధనలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు సమానంగా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి మరియు నిజమైన అవసరం ఉన్న వారికి సకాలంలో గ్యాస్ అందేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.
పారదర్శకత కోసమే ఈ మార్పులు
గతంలో కొందరు వినియోగదారులు సిలిండర్ అయిపోకముందే బుక్ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడేది. తాజా నిబంధనలతో గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అత్యవసర సమయాల్లో గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి గ్యాస్ వాడకంలో పొదుపు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
