Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మావిగన్’ అనే పదం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో, గతంలో తాను చేసిన ‘మావిగన్’వ్యాఖ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సమర్థించుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి.
అయితే, జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. జగన్ విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గతంలో చెప్పిన ‘మావిగన్’ అంటే ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూనే, ప్రతిపక్ష నేత తీరును లోకేశ్ తప్పుబట్టారు.
ముఖ్యంగా లోకేశ్ తన పోస్ట్కు జోడించిన హ్యాష్ట్యాగ్లు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. #MavigunMavayya, #HistoricAmaravatiResolution వంటి ట్యాగ్లతో ఆయన జగన్ను టార్గెట్ చేశారు. రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే, జగన్ కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతికి మళ్ళీ పునర్వైభవం వస్తున్న తరుణంలో, అధికార మరియు ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ ‘మాటల యుద్ధం’ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులపై వేగం పెంచుతుంటే, మరోవైపు జగన్ చేస్తున్న విమర్శలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.
