Nara lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుటుంబ సభ్యులు వరుసగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోవడంపై స్పందించిన లోకేశ్, వారితో పోటీపడటం ఎన్నికల కంటే కూడా కష్టమని చమత్కరించారు.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్–2025’ అవార్డును ప్రకటించింది. ఇదే సమయంలో లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి లండన్లో జరిగిన కార్యక్రమంలో ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును స్వీకరించారు. అలాగే ఆయన భార్య నారా బ్రహ్మణి దేశంలోని ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ,“నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్, అమ్మ గోల్డెన్ పీకాక్ అవార్డు, నా భార్య అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఈ కుటుంబంతో పోటీ పడటం ఏ ఎన్నికల కన్నా కష్టమే!” అని సరదాగా వ్యాఖ్యానించారు.
కుటుంబ సభ్యుల విజయాలపై గర్వంతో పాటు హాస్యాన్ని జోడించిన లోకేశ్ వ్యాఖ్యలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
