Nara lokesh: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా A320 ట్రయల్ ఫ్లైట్ రన్వే, నావిగేషన్, సిగ్నలింగ్ వ్యవస్థల పనితీరును పరీక్షించేందుకు నిర్వహించారు.
పనులు తుది దశలో
3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేపై విమానం సురక్షితంగా దిగడంతో విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు 97 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించారు.
నారా లోకేశ్ స్పందన
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, 2014–19 ఎన్డీఏ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2026 జూన్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయి అని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు వివరాలు
సుమారు రూ.4,592 కోట్ల వ్యయంతో, జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రూపకల్పన చేశారు. వచ్చే 4–5 నెలల్లోనే వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
