Nallagonda: దేశమంతా ఒక దారైతే.. నల్లగొండ జిల్లాది మరోదారి అన్న వ్యవహారం జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షుడిగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పున్న కైలాష్ నేత ఇటీవలే ఎంపికయ్యారు. అధిష్టానం ఆయన పేరును ప్రకటించగానే.. జిల్లాలో ఒక్కసారిగా వ్యతిరేక వర్గం భగ్గుమన్నది. ముఖ్యంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నది.
Nallagonda: పున్నకైలాశ్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రధాన అనుచరుడైన గుమ్ముల మోహన్రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలో అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనను కాదని, పున్న కైలాశ్ నేతకు ఎలా ఇస్తారంటూ ఏకంగా అధిష్టానంపైనే బాణం ఎక్కుపెట్టారు. తాను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గమనే ఉద్దేశంతోనే తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తనను వ్యక్తిగతంగా పున్న కైలాశ్ నేత దూషించారని నల్లగొండలో మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nallagonda: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రాల్లో యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా కనీసం ఫ్లెక్సీలు, పోస్టర్లలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన పున్న కైలాశ్ నేత ఫొటో పెట్టకపోవడం గమనార్హం. కనీసం ఆయనకు ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇతర చోట్ల జరిగినా కనీసం ఆయనకు ఆహ్వానం దక్కడం లేదని బీసీ వర్గాలు రగిలిపోతున్నాయి.
Nallagonda: ఇటీవల మునుగోడులో జరిగిన ఓ కార్యక్రమంలో పున్న కైలాశ్ నేతకు పోలీసుల నుంచి ఘోర అవమానం జరిగింది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడైనప్పటికీ ఓ మంత్రి వస్తున్నారన్న సమాచారంతో వేదిక నుంచి దిగిపోవాల్సిందిగా ఓ పోలీస్ అధికారి పున్న కైలాశ్కు హుకుం జారీ చేశారు. దీంతో ఆయన అవమానంగా భావించి అసహనంతో వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు.
Nallagonda: జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ పున్న కైలాశ్కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తున్నది. కనీసం అధికారిక కార్యక్రమాల్లో, ఇతర పార్టీ కార్యక్రమాల్లో కూడా కనీసం ఫ్లెక్సీలలో పున్న కైలాశ్ నేత ఫొటో పెట్టకపోవడం గమనార్హం. సుదీర్ఘకాలం అనంతరం ఒక బీసీ నేత డీసీసీ అధ్యక్షుడైనప్పటికీ కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలువకుండా అవమానిస్తున్నారని బీసీలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వర్గీయులు చేపట్టే కార్యక్రమాలకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలుస్తున్నది.
Nallagonda: నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో ఇంత జరుగుతున్నా.. ఒక డీసీసీ అధ్యక్షుడికి అవమానం జరుగుతున్నా.. టీపీసీసీ నాయకత్వం పట్టించుకోవడమే లేదు. జిల్లాకు చెందిన కీలక నేతలు కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ.. ఈ విషయంపై మాట్లాడకపోవడం శోచనీయం.
