Najmul Hossain: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి కొద్ది నెలల క్రితం తప్పుకున్న నజ్ముల్ హుస్సేన్ శాంటో.. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ విషయాన్ని ధృవీకరించింది. శాంటో 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్ ముగిసే వరకు జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై బోర్డు నాయకత్వం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జూన్లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ ఓటమి పాలైన తరువాత, మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండటం జట్టు ఐక్యతకు మంచిది కాదనే కారణం చూపుతూ శాంటో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రాజీనామా చేశారు.
Also Read: Cricket: > Ind vs Aus : భారత్ లక్ష్యం 187 పరుగులు.
అయితే, బోర్డులోని సీనియర్ అధికారులతో చర్చల అనంతరం, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో నిలకడ (Continuity) చాలా ముఖ్యమని బోర్డు నొక్కి చెప్పడంతో శాంటో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శాంటో ప్రశాంతమైన వైఖరి, వ్యూహాత్మక సామర్థ్యంపై బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. శాంటో తొలిసారి 2023లో టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో బంగ్లాదేశ్ ఆడిన 14 టెస్టుల్లో నాలుగు మ్యాచ్లు గెలిచింది. ముఖ్యంగా, గత ఏడాది పాకిస్థాన్లో 2-0తో సిరీస్ను కైవసం చేసుకోవడం (పాకిస్థాన్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం) ఆయన కెప్టెన్సీలో ముఖ్య ఘట్టం. ఐర్లాండ్తో నవంబర్ 11 నుంచి సిల్హెట్లో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు శాంటో రీ-ఎంట్రీ జట్టులో స్థిరత్వాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు.
