Naga Chaitanya: యువ కథానాయకుడు నాగ చైతన్య తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన తమిళ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఎల్సీయూ (Lokesh Cinematic Universe) ప్రాంఛైజీ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “తండేల్”. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్రబృందం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో నటుడు కార్తీ, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ, తన ఇష్టమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ అని, ఆయన తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
అదే విధంగా, భవిష్యత్తులో ఎల్సీయూ ప్రాంఛైజీలో వచ్చే ప్రాజెక్టులు (ఖైదీ 2, రోలెక్స్, లియో 2)లో నటించే అవకాశం వస్తే, తాను తప్పకుండా భాగం కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. చైతూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చైతూ నటించే అవకాశముందా? అంటే వేచి చూడాల్సిందే!

