Nadendla manohar: రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా ఎరువుల సరఫరా, పంపిణీపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో యూరియా కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని మీడియా కథనాలు, రాజకీయ ప్రత్యర్థుల దుష్ప్రచారం వల్ల రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ సీజన్లో జిల్లాకు 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటికే 32,757 టన్నులు సరఫరా చేశామని, మరో రెండు రోజుల్లో 2,200 టన్నులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ ఎరువులు అందించామని గుర్తుచేశారు.
యూరియా కొరతపై అబద్ధపు ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతు సంక్షేమంపై వారి చిత్తశుద్ధి ఉంటే, తమ పాలనలో రైతుల ధాన్యానికి బకాయి రూ.1674 కోట్లు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ బకాయిలను తీర్చిందని తెలిపారు.
ఎరువుల అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 29 చెక్పోస్టుల వద్ద నిఘా మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను బలోపేతం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 530 పంపిణీ కేంద్రాల ద్వారా ఎరువులు పారదర్శకంగా అందిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, అధికారుల ఫోన్ నంబర్లను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, కొందరు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.