Crime News: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఉదయం ఒక భయంకరమైన ఘోరం జరిగింది. కుటుంబ తగాదాలు మరియు పొలం గట్ల వివాదం లో ఇద్దరు మహిళల నిండు ప్రాణాలు బలి తీసుకోగా, మరో ఇద్దరు చావు బతుకుల మధ్యకు నెట్టింది. ముప్పిడి వివేక్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకుని, నలుగురు మహిళలపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి తెగబడటం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
పొలం సరిహద్దుల విషయంలో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన వివేక్, మహిళలని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో కలపాల జిలుగులమ్మ, చుక్కమ్మగా అనే మహిళలు మృతి చెందారు.
ఇది కూడా చదవండి: Silver Rate Today: ఒక్కేసారి రూ. 20,000 పెరిగిన వెండి..
నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఉషారాణి, ధనలక్ష్మిలను స్థానికులు గమనించి వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. చిన్నపాటి కుటుంబ కలహాలు, భూమి సరిహద్దు గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి చేసిన అనంతరం నిందితుడు వివేక్ అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే జంగారెడ్డిగూడెంలో ఒక్కసారిగా జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
