MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్లో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున బరిలోకి దిగనున్నట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జులైలో ధోనీ 45 సంవత్సరం లోకి అడుగుపెట్టనున్నారు. అయితే, పెరిగిన వయస్సు ఇంకా ఫిట్నెస్ దృష్ట్యా ఈ సీజన్లో ధోనీ పాత్రపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ధోనీ ఆడటం ఖాయం, కానీ అన్ని మ్యాచ్ల్లోనూ కనిపిస్తాడా లేదా అన్నది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
సంజూ శాంసన్ రాకతో భారీ మార్పులు
ఈ సీజన్ వేలానికి ముందు జరిగిన అతిపెద్ద ట్రేడింగ్ డీల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ నుండి సంజూ శాంసన్ సీఎస్కే లోకి తీసుకున్నారు. రవీంద్ర జడేజా, సామ్ కరన్లను వదులుకుని మరీ సంజూను తీసుకోవడం వెనుక సీఎస్కే మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
ధోనీకి విశ్రాంతినిచ్చే మ్యాచ్ల్లో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతారు. ధోనీ తర్వాత జట్టును నడిపించే సత్తా ఉన్న ఆటగాడిగా సంజూను యాజమాన్యం భావిస్తోంది. స్క్వాడ్లో ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ వంటి యువ కీపర్లు ఉన్నప్పటికీ, సంజూ ప్రాధాన్యత ఎక్కువగా ఉండనుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ – ధోనీకి కలిసొచ్చే అంశం
గత రెండు సీజన్ల నుంచి అమల్లో ఉన్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ ధోనీకి వరంగా మారింది. మోకాలి, వెన్ను సమస్యల కారణంగా ధోనీ పూర్తి ఇన్నింగ్స్ ఆడటం కష్టంగా ఉంది. అందుకే ఆయనను కేవలం చివరి ఓవర్లలో ‘ఫినిషర్’గా మాత్రమే బరిలోకి దించే అవకాశం ఉంది.
మైదానంలో ఉన్నంత సేపు యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు దిశానిర్దేశం చేస్తూ ధోనీ కీలక పాత్ర పోషించనున్నారు.
చెపాక్లో ‘థాలా’ సందడి
ధోనీకి తన హోమ్ గ్రౌండ్ అయిన చెన్నైలోని చెపాక్ స్టేడియంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ సీజన్లో కనీసం చెన్నైలో జరిగే హోమ్ మ్యాచ్లన్నింటిలోనూ ధోనీ తప్పకుండా ఆడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత సీజన్లో సీఎస్కే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచినప్పటికీ, ఈసారి ధోనీ-సంజూ ద్వయం జట్టును మళ్ళీ టాప్లోకి తీసుకెళ్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
